కేప్టౌన్, జనవరి 1 : దక్షిణాఫ్రికాతో క్రికెట్ సిరీస్ అంటే ఏ దేశమైన ఆలోచించే విషయం అక్కడి బౌన్స్ పిచ్ లు.. ముఖ్యంగా వారి పేస్ కు తగిన విధంగా అక్కడి మైదానాలు ఉంటాయి. ప్రస్తుతం కోహ్లీ సేన సఫారీలతో టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియా స్వింగ్ స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.."దక్షిణాఫ్రికా పర్యటన అనగానే గుర్తొచ్చేది బౌన్సీ పిచ్లు. ఐతే ఇప్పడు ఎలాంటి వికెట్లు రూపొందిస్తారో చెప్పడం కష్టం. కూకాబుర్రతో బౌలింగ్ చేయడం చాలా కష్టం. 25-30 ఓవర్ల తర్వాత వైవిధ్యానికి అవకాశం ఉండదు. వీటికి అలవాటు పడాలని అనుకుంటున్నాం. ఇంకా వ్యూహాల గురించి చర్చించలేదు. సుదీర్ఘంగా బౌలింగ్ చేయడంపై దృష్టిపెట్టాం. గత రెండేళ్లుగా మేం అన్ని పరిస్థితుల్లో బాగా ఆడాం. బౌలింగ్ టెక్నిక్స్ను మేం ఒకరితో మరొకరం పంచుకుంటున్నాం. సఫారీ జట్టు చాలా బలమైనది. తొలి టెస్ట్కు కొన్ని రోజులు ముందు వ్యూహాలపై చర్చిస్తాం” అని వ్యాఖ్యానించారు.