ఢిల్లీ, జూన్ 19 : ఢిల్లీ మంత్రులు వరుసగా ఊహించని ఎదురుదెబ్బలకు గురి అవుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా.. తాజాగా ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలోనూ సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి సత్యేంద్రజైన్పై వస్తున్న మనీలాండరింగ్ ఆరోపణలపై అధికారులు ఆయన భార్యను ప్రశ్నించారు. డొల్ల కంపెనీల ద్వారా రూ. 4.6 కోట్ల హవాలాకు పాల్పడినట్లు సత్యేంద్రజైన్పై ఇటీవల ఆరోపణలు రావడంతో ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టిందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ఘటనలో ఇప్పటికే సత్యేంద్రజైన్కు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెల రోజుల క్రితం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సత్యేంద్రజైన్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన భార్యను విచారించారు. తనపై వస్తున్న ఆరోపణలను సత్యేంద్రజైన్ ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.