లండన్, డిసెంబర్ 31 : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఎబోలా అనే వైరస్ ఇప్పటి వరకు 932 మందిని పొట్టనపెట్టుకుంది. అసలు ఎబోలా సోకిన తన పౌరులను కాపాడుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన ప్రయత్నం, ఆ దేశ పౌరులను ఆగ్రహావేశాలకు గురి చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. చికిత్సే లేని ఎబోలా వ్యాధి నుంచి దూరంగా పారిపోవడం మినహా, సోకిన తర్వాత చేయగలిగిందేమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్న నేపధ్యంలో, డెన్మార్క్లోని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హేగన్ శాస్త్రవేత్తలు ఈ ఎబోలా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఎంజైమ్ను కనుగొన్నారు. ఎబోలా వైరస్ మరిన్ని వైరస్ లను ఉత్పత్తి చేయకుండా, ఇన్ఫెక్షన్లు రాకుండా వాటి సామర్థ్యాన్ని "పీపీ2ఏ-బీ56" అనే ఎంజైమ్ తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వైరస్ పుట్టించేందుకు ఎబోలా ఈ ఎంజైమ్ను ఉపయోగించుకుంటుందని, అదే ఆ ఎంజైమ్ను పని చేయకుండా చేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.