ముంబయి, డిసెంబర్ 31 : ఈ నెల 28న కమలా మిల్స్ ప్రాంగణంలో "వన్ అబవ్" పబ్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో, 14 మంది మృతి చెందారు. అయితే, దీనిపై స్పందించిన బీఎంసీ(బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్) మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని, వెంటనే చర్యలు చేపట్టింది. భద్రతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, పబ్లపై అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. దాదాపు 314రెస్టారెంట్లు, పబ్లలో అక్రమ కట్టడాలను క్రేన్ల సాయంతో కూల్చివేశారు. నిబంధనలు పాటించని ఏడు హోటళ్లతో పాటు వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అలాగే, కమలా మిల్స్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురు బీఎంసీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. కాగా, అగ్నిప్రమాదం జరిగిన "వన్ అబవ్" పబ్ యజమానులపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.