న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : లసిత్ మలింగ...వైవిధ్యమైన బౌలింగ్ శైలితో, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ లను దడ పుట్టించిన ఈ శ్రీలంక క్రికెటర్ గత కొన్ని రోజులుగా జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్తో జరిగిన ఓ టీ20లో చివరిసారిగా ఆడిన మలింగను, సెలక్టర్లు తాజాగా బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లోను స్థానం కల్పించలేదు. ఈ సందర్భంగా తన క్రికెట్ భవితవ్యం పై ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ..” జట్టులో స్థానం కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. సెలెక్టర్లు నన్ను తీసుకుంటే ఆడేందుకు నేను సిద్ధం. నా వయసు వారికి విశ్రాంతి అవసరం లేదు. మహా అయితే రెండేళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాము. 25, 26 ఏళ్ల వయసులో ఆటగాడికి ఆట పరంగా విశ్రాంతి అవసరం. వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని మాకు ఉంటుంది. 2019 ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అదే నా అఖిరి టోర్నీ” అని వ్యాఖ్యానించాడు.