హర్యానా, డిసెంబర్ 30: వైద్యం కోసం వచ్చిన రోగికి వైద్యం చేయకుండా నియమాలు నిబంధనలు అంటూ ఆ రోగి ప్రాణాలను తీసేశారు ఇక్కడి వైద్యులు. హర్యానాలోని సోనిపట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో అమరుడైన హవల్దార్ లక్ష్మణ్ దాస్ భార్య శకుంతల దేవీ(55) గొంతు కేన్సర్, హృద్రోగ సమస్యలతోబాధపడుతోంది. ఒక్కసారిగా ఆమె ఆరోగ్య౦ ఆందోళనకరంగా మారింది. దీంతో ఆమెను, కుటుంబ సభ్యులు ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అయితే, నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం చేస్తామని వైద్యులు చెప్పారు. దాంతో ఆమె కుమారుడు, వాట్సప్ ద్వారా ఆధార్ కార్డును వైద్యులకి చూపించినప్పటికీ అది చెల్లదని చెప్పేసి వైద్యం చేయకుండా ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్య౦ కారణంగా తన తల్లి చనిపోయింది అంటూ ఆమె కుమారుడు కన్నీటిపర్యంతమయ్యాడు.