నదుల అనుసంధానమే నా లక్ష్యం: చంద్రబాబు

SMTV Desk 2017-12-30 13:10:06  chandrababu naidu, prakasam Byareji, vijayawada

అమరావతి, డిసెంబర్ 30: రాష్ట్రంలోని నదులను అనుసంధానించడమే జీవిత లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో దుర్గాఘాట్ వద్ద నిర్వహించిన ప్రకాశం బ్యారేజీ 60 ఏళ్ల ఉత్సవాలకు సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు ఉద్యోగుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక నాడే కర్నూలు కాకుండా విజయవాడ రాజధాని అయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండేదని వ్యాఖ్యానించారు. నేటి పరిస్థితుల్లో పట్టిసీమ నిర్మించుకుని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఘనంగా కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. గోదావరి, ప్రకాశం ఆనకట్ట, బ్యారేజీల నిర్మాణం, కాటన్‌దొర, ప్రకాశం పంతులు లాంటి వారి పాత్రను, చరిత్రను స్మరించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.