న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : భారత్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, అతని మద్దతుదారులపై న్యూఢిల్లీ పోలీసులు సెక్షన్ 323, 341 కింద కేసు నమోదు చేశారు. రెజ్లర్ పర్వీన్ రాణాతోపాటు అతని సోదరుడు నవీన్ రాణాపై సుశీల్, అతని మద్దతుదారులు దాడి చేశారని ఆరోపిస్తూ న్యూఢిల్లీ పోలీసులకు నవీన్ రాణా ఫిర్యాదు చేశాడు. నిన్న ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ ట్రయల్స్ పోటీల్లో భాగంగా సుశీల్ అన్ని బౌట్లలో విజేతగా నిలిచాడు. సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం సుశీల్-పర్వీన్ మద్దతుదారుల మధ్య గొడవ మొదలవడంతో స్టేడియంలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. సుశీల్తో పోటీపడేందుకు సాహసించినందుకు తనను, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఆరోపించాడు. కాగా ఈ 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన సుశీల్ సెమీస్ లో ప్రవీణ్ రాణాపై సునాయాసంగా గెలిచాడు. తర్వాత ఫైనల్లో నెగ్గి వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్ట్కోస్ట్లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు.