న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : భారత్ జట్టు ప్రస్తుతం సఫారీ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. స్వదేశంలో మంచి రికార్డు ఉన్న టీమిండియా విదేశంలో అదే ఊపును కొనసాగించాలని భావిస్తుంది. కాగా మూడు టెస్టులు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వచ్చే నెల 5న కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఈ టెస్టు జట్టు లో భారత్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా మొదటి సారిగా చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భారత్ మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.."బుమ్రా కు కేప్టౌన్లో జరిగే టెస్టుకు తుది జట్టులో స్థానం కల్పించండి. ఈ టెస్టులో అతన్ని ఆడించడం మనకు దొరికిన మంచి అవకాశం. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. ఇక్కడి ట్రాక్పై అతడు రాణిస్తాడని భావిస్తున్నా. సౌతాఫ్రికా పిచ్ లపై షమి, ఇషాంత్ ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలరు. వారికి అండగా మూడో పేసర్ కోసం బుమ్రా, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. ఇరు జట్లు చాలా బలంగా ఉన్న నేపధ్యంలో పోటీ చాలా ఆసక్తికరంగా జరగనుంది” అని తెలిపారు.