ముంబాయి, డిసెంబర్ 29: మహారాష్ట్ర రాజధాని ముంబాయి మహానగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... లోయర్పరేల్లో గల కమల మిల్స్ సముదాయంలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో స్నేహితులతో కలిసి సంతోషంగా పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్న ఓ యువతి సజీవదహనమైంది. చనిపోయిన 14 మందిలో 12 మంది మహిళలేనని అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక కేఈఎం, సియాన్ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.