న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ -11 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజీల యాజమాన్యం ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, మరో ఇద్దర్ని రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ నిర్వాహకుల ఆటగాళ్లకు వేలం నిర్వహించనున్నారు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్, ఆ దేశపు ఆటగాడు క్రిస్ లిన్ వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోతాడని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ విషయం పై ఆసీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ రీకి పాంటింగ్ మాట్లాడుతూ.. "ఆసీస్ ఆటగాడు క్రిస్ లిన్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ వేలంలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంటాడు. అతను చాలా ప్రతిభ గల ఆటగాడు. హార్డ్ హిట్టర్గా లిన్కు మంచి పేరుంది" అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడిన లిన్ 7 మ్యాచులు ఆడాడు. 50 సగటుతో 180 స్ట్రైక్ రేటుతో మంచి ప్రదర్శన చేశాడు.