న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందామన్న ఆశ ఈ ఏడాది అందని ద్రాక్షగా మిగిలింది. ప్రపంచ మహిళా సింగిల్స్ లో తైవాన్ క్రీడాకారిణి తై జుయింగ్ ప్రధమ స్థానంలో ఉండగా, అకినా యమాగుచి (జపాన్) రెండవ స్థానంలోను, సింధు మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. కాగా వచ్చే ఏడాది నంబర్ వన్ ర్యాంకును అందుకుంటానని పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పీబీఎల్లో చెన్నై స్మాషర్స్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.." వచ్చే ఏడాది నన్ను నేను నెంబర్ వన్ ర్యాంకులో చూసుకోవాలని ఉంది. మంచి ప్రదర్శన చేస్తే నెంబర్ వన్ ర్యాంక్ సొంతమవుతుంది. ప్రస్తుతం మహిళా సింగిల్స్ లో చాలా మ్యాచ్ లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో చైనా జపాన్ క్రీడాకారులతో జరిగే మ్యాచ్లు ఎక్కువ సమయంతో, హోరాహోరీగా జరుగుతాయనే భావిస్తున్నాను." అని తెలిపారు