అమరావతి, డిసెంబర్ 28 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఏడాది వేసవి కాలం సమయానికి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమ అభిప్రాయం తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ను కోరుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, సిద్ధం చేసిన లేఖపై సంతకం చేసినట్లు సమాచారం. ఈరోజు ఆ లేఖను ఏసీజేకు అందజేయనున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు హైదరాబాద్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుండి అక్కడకి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక భవనంలో ఏపీ హైకోర్టును ప్రారంభించాలని యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉండగా శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నమూనా ఖరారు తుది దశలో ఉంది.