మెల్బోర్న్, డిసెంబర్ 28 : ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో బ్యాట్స్ మెన్ అలిస్టర్ కుక్ డబుల్ సెంచరీ సాధించి (244, నాటౌట్) తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు ఆధిక్యం అందించాడు. మూడో రోజు ఆట ముగేసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 491 పరుగులు చేసింది. 192/2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు లో కెప్టెన్ రూట్- కుక్ మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత ఆసీస్ బౌలర్ కమ్మిన్స్ సారధి(61) రూట్ వికెట్ ని తీసి ఈ జోడీని విడదీశాడు. తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేదు. అయినప్పటికీ కుక్ మాత్రం తన పోరాటాన్ని ఒంటరిగా కొనసాగించాడు. ప్రస్తుతం క్రీజులో కుక్(244), ఆండర్సన్ (0) ఉన్నారు. కాగా ఈ ద్విశతకంతో కుక్ డబుల్ సెంచరీ సాధించిన తరువాత అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్, ద్రావిడ్ల సరసన కుక్ నిలిచాడు. ఇంతక ముందు అత్యధిక టెస్టు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో బ్రాడ్మన్(12సార్లు), అగ్రస్థానంలో ఉండగా, సంగక్కరా(11సార్లు) రెండో స్థానంలో , బ్రియాన్ లారా(9) మూడో స్థానంలో, జయవర్థనే (7) నాలుగవ స్థానంలో ఉన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్కు చెందిన లారా(11,953) ను కుక్ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం 11,956 పరుగులతో కుక్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.