బెంగుళూరు, డిసెంబర్ 28: నిదురలోనే అగ్ని ప్రమాదంతో కుటుంబం మొత్తం అనంతలోకాలకు పయనమైన ఘటన మహదేవపూర పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరెంటు పోయిందని కొవ్వొత్తి వెలుగులో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టిన్ ఫ్యాక్టరి దగ్గరలో ఉదయ నగర్ లో నివాసం ఉంటున్న సంతోష్ ఆయన భార్య సోఫియా, కుమార్తె ఫ్లోర రోజులాగే పడుకునేందుకు సిద్దం కాగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవ్వొత్తి వెలిగించి, దోమలు రాకుండా ఉండేందుకు కాయిల్ అంటించి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం వారి ఇంట్లోంచి పొగలు రావడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ఇంటి తలుపులు విరగోట్టే సరికే సంతోష్, సోఫియాలు మృతిచెందారు. అప్పటికే 70 శాతం వరకు కాలిన ఫ్లోరను దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా చికిత్సా పొందుతూ మరణించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.