న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : జాదవ్ కుటుంబసభ్యుల భావోద్వేగ కలయికను పాకిస్థాన్ తన ప్రచార సాధనంగా మలుచుకుందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. నేడు రాజ్యసభలో జాదవ్-కుటుంబసభ్యుల సమావేశంపై సుష్మాస్వరాజ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మానవతా దృక్పథంతో వారి భేటీకి అనుమతినిచ్చామని పాక్ చెబుతోంది, కానీ పాక్ మాత్రం వారిపై వ్యవహరించిన తీరు అమానవీయమని ఆమె దుయ్యబట్టారు. కుటుంబసభ్యుల కనీస హక్కులను పాక్ పదేపదే ఉల్లంఘించింది. భేటీ పేరుతో వారికి ఓ భయానక వాతావరణాన్ని కల్పించిందని, సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. అయితే, ఆమె ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ.. జాదవ్ కుటుంబాన్ని పాక్ అవమానించడం అంటే మొత్తం భారతీయులనే అవమానించినట్లు. రాజకీయ విభేదాలు లేకుండా దీనిపై అందరం పోరాడాలని, మన తల్లులు, సోదరీమణుల పట్ల వేరే దేశం చెడుగా ప్రవర్తిస్తే దాన్ని చూస్తూ సహించకూడదని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.