ఆటో, బస్సు ఢీ.. ఐదుగురు మృతి..

SMTV Desk 2017-12-28 12:44:33  road accident, guntur, phirangipuram,

గుంటూరు, డిసెంబర్ 28: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉద‌యం ఆటోను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన గాయత్రి, రేణుక, శైలజ అనే విద్యార్థినులు, కార్తీక్ రెడ్డి అనే మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ ధనరాజ్ మృతి చెందారు. ఈ విద్యార్ధులు పదో తరగతి చదువుతున్నారు. ప్రత్యేక తరగతుల కోసం వీరంతా పేరేచర్లలోని ఇంటెల్ పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలను కోల్పోయిన విషాదంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబుచ, సభాపతి కోడెల శివప్రసాదరావు, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మృతుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.