లఖ్నవూ, డిసెంబర్ 28 : తన ప్రేమకు అడ్డుచెప్పిందని భావించిన బాలిక తల్లిని అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడితో కలిసి పథకం పన్ని, తల్లినే హతమార్చిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఫతేహ్పూర్కి చెందిన ఏడో తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని ప్రేమించింది. తరచు తల్లికి తెలియకుండా అతన్ని రహస్యంగా కలుసుకుంటూ ఉండేది. ఓ రోజు తల్లికి అనుమానం వచ్చి కూతురినీ నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లి ఆ బాలికకు ఈ వయసులో ఇలాంటివి మంచిది కాదని హెచ్చరించింది. తన ప్రేమకు అడ్డుచెప్పిందని భావించిన బాలిక తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ప్లాన్ ప్రకారం ఈ నెల 24న అర్థరాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిచి నిద్రిస్తున్న తల్లిని గొంతునొక్కి చంపేసింది. అంతేకాకుండా తల్లి వద్ద ఉన్న ఫోన్లు పగలగొట్టేసింది. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలీనట్లు పోరుగింటికి వెళ్లి, తన తల్లి అపస్మారక స్థితిలో ఉందని ఏడ్చింది. దాంతో వారు వైద్యులను పిలిపించగా ఆమె మృతిచెందినట్లు తెలిసింది. కానీ స్థానికులకు బాలికపై అనుమానంరావడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో బాలికను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పెంపుడు తల్లిని తానే ప్రియుడితో కలిసి చంపినట్లు అంగీకరించింది. దాంతో పోలీసులు వారిద్దరినీ జువెనైల్ హోంకు తరలించినట్లు వెల్లడించారు.