ముంబై, డిసెంబర్ 28 : ఐపీఎల్ -11 సీజన్ లో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఆసీస్ క్రికెట్ సారథి డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అట్టిపెట్టుకోవాలని భావిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఎల్ 10 పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నిర్వాహకులు ఆటగాళ్లందర్ని వేలంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఐపీఎల్ నిర్వహకులు రిటెన్షన్ విధానం ద్వారా ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, మరో ఇద్దర్ని రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి పొందేలా అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చెన్నై ధోనీ, రైనాను, ముంబయి రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 4 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పేర్లను అందజేయాలని ఐపీఎల్ మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది.