రాజమహేంద్రవరం, డిసెంబర్ 27: కొంత కాలంగా హైదరాబాద్ లో చెడ్డి, బనియన్లు ధరించి దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ముఠా కదలికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం లోని ప్రకాష్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ అపార్టుమెంట్లో ఆదివారం అర్ధరాత్రి ఈ ముఠా సభ్యులు చోరీకి యత్నించగా చూసిన వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ముగ్గురు యువకులు నిక్కర్లు ధరించి, ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ వేసుకున్నట్లు గుర్తులు తెలపడంతో, వీరు చెడ్డీ గ్యాంగ్ అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఉదయం పూట బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతూ ఇంటిని గమనిస్తుంటారని, దీనికితోడు ఇళ్ల బయట ఆరవేసిన దుస్తుల ఆధారంగా ఖరీదైన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతారని పోలీసులు వెల్లడించారు. పరిసర ప్రాంతాలలో అనుమానంగా వ్యవహరించే వారి గురించి పోలీసులకు సమాచారం అందివాలన్నారు.