సిమ్లా, డిసెంబర్ 27 : హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరామ్ ఠాకూర్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. హిమాచల్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ 44 సీట్లు సాధించింది. అనూహ్యంగా బీజెపీ సీఎం అభ్యర్ధి ధుమాల్ ఓడిపోవడంతో, ముఖ్యమంత్రి పదవి జైరామ్ ఠాకూర్ని వరించింది. రాష్ట్రంలో రాజకీయంగా కీలక ప్రాంతమైన మండీ నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్న తొలి వ్యక్తి జైరామ్ కావడం విశేషం. ఇప్పటివరకూ సీఎం బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యధికులు సిమ్లా, కాంగ్రా, సిర్మౌర్కు చెందిన వారే. తాజా ఎన్నికల్లో మండీలోని 10 స్థానాల్లో తొమ్మిదింటిని భాజపా తన ఖాతాలో వేసుకుంది.