ముంబై, డిసెంబర్ 26 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహం ఈ నెల 11న ఇటలీలోని టస్కనీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ను ఫిన్లాండ్ లో ఎంజాయ్ చేసిన ఈ జోడీ, తర్వాత భారత్ చేరుకొని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా వివాహ విందును ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా విరుష్క జోడీ ముంబయిలో రెండోసారి వివాహ విందు ఇవ్వనుంది. ఈ విందుకు ఎలాంటి డిజైనర్ దుస్తులు ధరిస్తారు..? అతిథులు ఎవరెవరు వస్తారు..? అన్న చర్చతో అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దేశంలో అతి పెద్దదైన సెయింట్ రిజిస్ హోటల్లోని 9వ లెవల్లో ఉన్న ఆస్టర్ బాల్రూమ్లో ఈ రోజు వివాహ విందు జరగనుంది. గతంలో జహీర్ ఖాన్-సాగరికల వివాహ విందు కార్యక్రమం కూడా ఇక్కడే జరిగింది. దీనికి కోహ్లీ, అనుష్కతో కలిసి విచ్చేశాడు. విందు కార్యక్రమం ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని సమాచారం. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మతో పాటు కోచ్ రవిశాస్త్రి తదితరులు విందుకు హాజరుకానున్నారు.