తిరువనంతపురం, డిసెంబర్ 26 : కేరళకు చెందిన జేఆర్ రాజీ అనే ఓ మహిళ సాహసానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆమె చేసిన సాహసమెంటో తెలుసా? అత్యంత ప్రాణాంతకమైన పామును నేర్పుగా పట్టుకుంటుంది. కేరళ తిరువనంతపురం జిల్లాలోని నన్నియోడే గ్రామం. ముఫ్పైమూడేళ్ల రాజీ వృత్తిరీత్యా ట్రక్కు డ్రైవర్. పాముల పట్ల ప్రేమ, ఆసక్తితో వాటిని పట్టుకోవడం ప్రారంభించిన ఆమె, ఇప్పుడా కళలో ఆరితేరి పోయారు. తిరువనంతపురం కొల్లాం జిల్లాలో ఎవరింట్లో పాము కన్పించినా ముందుగా రాజీకే ఫోన్ చేసేంతగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా గత తొమ్మిది నెలల్లో ఆమె 119 పాములు పట్టుకున్నారు. మనుషులు, పాములకు ఎలాంటి హాని జరగకుండా చూడగలిగారు. పట్టుకున్న పామును రాజీ నేర్పుగా ఒక సీసాలో పెడతారు. ఆ సర్పం విషపూరితమైనది అయితే, అటవీశాఖాధికారులకు అప్పగిస్తారు. లేదంటే సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతారు. తమ ఇంటికి పాము వచ్చిందని కంగారు పడుతూ ఏ సమయంలో ఫోన్ చేసినా, రాజీ వెళ్లి ఆ సర్పాన్ని పట్టుకుంటారు. అందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ సాహసం తోటీ మహిళ శక్తికి ఆదర్శంగా నిలుస్తుంది.