అమరావతి, డిసెంబర్ 26 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు ఎమ్మెల్సీ పదవి నామినేషన్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఐడీసీ ఛైర్మన్ కేఈ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు, చర్చలు జరిపారు. చివరికి జాబితాలో ముందు వరుసలో ఉన్న కేఈ ప్రభాకర్కే అవకాశం ఇస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించారు. దీంతో నేడు కేఈ ప్రభాకర్ తన అనుచరులతో కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1995-2004 మధ్య తొమ్మిదేళ్ల పాటు విద్యా, అటవీ, జలవనరుల శాఖల మంత్రిగా పనిచేసిన కేఈ ప్రభాకర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోరిన ఆయనకు ఈ ఏడాది జులైలో రాష్ట్ర ఐడీసీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. అన్యూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలతో శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీని వీడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు అవకాశం రావడం జరిగింది.