బెంగళూరు, డిసెంబర్ 26 : పెళ్ళైన నెలకే నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కెంగేరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. మండ్యకు చెందిన ప్రవీణ్, ఉత్తర హళ్లి గౌడర పాళ్య వాసి ప్రియా ప్రేమించుకున్నారు. పెళ్ళికి వారి పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో, కొందరు పెద్దల సమక్షంలో నెల కిందట పెళ్లి చేసుకున్నారు. కెంగేరి సమీపంలోని మైలసంద్ర వద్ద అద్దె ఇల్లు తీసుకుని కొత్త కాపురం పెట్టారు. కుటుంబ నిర్వహణకు వీధి పక్కన తోపుడు బండి పెట్టుకుని వ్యాపారం చేపట్టారు. జీవితం కష్టంగా సాగుతోంది. పెద్దల నిరాకరణ, జీవనం సాగడం కష్టంగా మారడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం మృతురాలు ప్రియా తల్లి ఆ ఇంటికి రావడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.