న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : ఈ ఏడాదిలో వరుసగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రైలు, రహదారుల నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో మెట్రో మెజెంటా లైన్ను ప్రారంభించిన అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ...తొలుత ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, ఆధునిక కాలంలో రవాణా ప్రాధాన్య అంశమన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన మెట్రో లైను కేవలం ఇప్పటి తరాలకే కాకుండా, భవిష్యత్ తరాలకు సైతం ఉపయోగపడుతుందన్నారు. పెట్రోలియం దిగుమతులు తగ్గాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 సంవత్సరం నాటికి భారత్ తన పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవాలన్నదే తన కల అని అన్నారు. 2002 డిసెంబర్ 24న నాటి ప్రధాని వాజ్పేయీ తొలిసారి మెట్రో రైలులో ప్రయాణించడం చరిత్రాత్మక ఘట్టమని గుర్తుచేశారు. అప్పటి నుంచి మొదలు రాజధాని ప్రాంతంలో నానాటికీ మెట్రో రైలు విస్తరిస్తూనే ఉందని వివరించారు.