హైదరాబాద్, డిసెంబర్ 25 : నేడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అలియాస్ నరసింహారెడ్డి, ఆయన భార్య రజితతో కలిసి డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లడుతూ... జంపన్న పై మొత్తంగా 100 కేసులు ఉండగా, తెలంగాణలో సుమారు 50కి పైగా కేసులున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టుల్లో మార్పు రావడం లేదని, అందుకే సైద్ధాంతిక విబేధాలతో తాను మావోయిస్టు దళం నుంచి తప్పుకుని, లొంగిపోతున్నట్లు జంపన్న చెప్పినట్లు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై రూ.25లక్షలు, రజితపై రూ.5 లక్షల రివార్డు ఉందని.. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని వారికి అందజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు గ్రూపుల్లో తెలంగాణకు చెందిన 135 మంది పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోతే ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.