న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : ఇండియాలో ఓటర్లుగా నమోదు చేసుకున్న ప్రవాస భారతీయుల సంఖ్య (ఎన్ఆర్ఐ) గత మూడు సంవత్సరాల్లో రెట్టింపైనట్టు ఎలక్షన్ కమీషన్, ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. విదేశాల్లో నివసించే భారతీయుల పరంగా చూస్తే ఈ గణాంకాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోటి మందికి పైగా ప్రవాసులుంటే వారిలో కేవలం 11,846 మందే ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. 2015 నాటికి వీరి సంఖ్య రెండింతలై 24,348కి చేరిందని పార్లమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది. కాగా వీరిలో 23,556 మంది కేరళకు చెందిన వారే కావడం విశేషం. గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న ఎన్ఆర్ఐలు ఓటు వేయాలంటే భారత్ దేశానికి వచ్చి తమ నియోజకవర్గాల్లో స్వయంగా ఓటు హక్కు వాడుకోవాలి. ఇది కష్టంతో కూడుకున్నపని కావడంతో తాజాగా ఈ అంశం చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎన్ఆర్ఐలు ఇకపై వేరే వ్యక్తి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించే అవకాశం ఉంటుంది.