సిమ్లా, డిసెంబర్ 24 : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం పై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. ఈ రోజు జరిగిన బీజెపీ శాసనసభా పక్ష సమావేశంలో సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఠాకూర్ను ఎన్నుకున్నట్లు తోమర్ తెలిపారు. ఇటీవల జరిగిన హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ 44 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమయ్యింది. కానీ బీజెపీ సీఎం అభ్యర్థి ధుమాల్ అనూహ్యంగా ఓటమి చెందడంతో సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పేరు వెలుగులోకి వచ్చిన సీఎం పదవి జైరామ్ ఠాకూర్ ని వరించింది. రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2007 నుంచి 2012 వరకు హిమాచల్ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.