గుహవతి, డిసెంబర్ 24: ప్రొ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆరంభపోరులో అవధె వారియర్స్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై స్మాషర్స్తో జరిగిన మూడు మ్యాచ్లలోను విజయం సాధించింది. శనివారం టోర్నీ తొలి మ్యాచ్లో అవధె వారియర్స్ 4-3తో స్మాషర్స్కు షాకిచ్చింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకున్నా వారియర్స్ పైచేయి సాధించడం విశేషం. మొదట మిక్స్డ్ డబుల్స్లో క్రిస్టినా పెడెర్సన్, తాంగ్ చున్ మన్ జంట 10-15, 15-5, 15-12తో క్రిస్ అడ్కాక్-గాబ్రియెల్ అడ్కాక్ జోడీపై గెలిచి వారియర్స్కు మంచి ఆరంభాన్నిఅందించింది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో కశ్యప్ 15-12, 15-8తో డానియల్ ఫరిద్ (చెన్నై)ను ఓడించాడు. దీనిని అవధ్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకోవడంతో అవధ్కు రెండు పాయింట్లు లభించాయి. దీంతో వారియర్స్ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో మ్యాచ్గా జరిగిన మరో పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్)15–12, 15–13తో లెవెర్డెజ్పై గెలవడంతో అవధ్ జట్టు రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 4–0తో విజయాన్నిసొంతం చేసుకుంది. చివరి రెండు మ్యాచ్లు (పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్) నెగ్గడం ద్వారా వారియర్స్ ఆధిక్యాన్ని చెన్నై 4-3 కు తగ్గించగలిగింది. డబుల్స్లో క్రిస్ అడ్కాక్, లీ జంట విజయం సాధించగా.. సింగిల్స్లో పీవీ సింధు 15-10, 15-9తో ఉత్తేజిత రావును ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో, హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది.