భార్యపై పైశాచికత్వం ప్రదర్శించిన భర్త...

SMTV Desk 2017-12-24 11:13:48  Dowry, problems, counsaling, Teacher nujividu krishna dist

నూజివీడు, డిసెంబర్ 24 : తెచ్చిన కట్నం సరిపోక అదనపు కట్నం కావాలంటూ తాళికట్టిన భార్యను ఓ ఉపాధ్యాయస్థానంలో ఉన్న భర్త పైశాచికత్వంగా హింసించిన ఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత రావిచెర్ల గ్రామానికి చెందిన బెజవాడ రామకృష్ణ నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఈయనకు ఆగిరిపల్లి మండలం ఒట్టిగుడిపాడు గ్రామానికి చెందిన దుర్గా కల్యాణితో వివాహం జరిగింది. 14 సెంట్ల భూమి, రూ.5లక్షల నగదు, రూ.5లక్షల విలువైన లాంఛనాలతో ఆమెను పెళ్లి చేసుకుని, మళ్లీ అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు రామకృష్ణను పలుమార్లు మందలించారు. అయినప్పటికీ ఈ నెల 22న భార్యను మళ్లీ కట్నం కోసం తీవ్రంగా వేధించి, కొట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శనివారం నూజివీడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి, బాధితురాలికి చికిత్స అందించారు. కాగా, కట్నం తీసుకోవడమే నేరంగా భావించకుండా అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టిన రామకృష్ణను ఎస్సై చిరంజీవి అదుపులోకి తీసుకున్నారు.