న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్)గా భారత్ మాజీ వికెట్ కీపర్ సాబా కరీమ్ ఎంపికయ్యారు. ఈ పదవి కోసం మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్తో పాటు కరీమ్ పేరు క్రికెట్ వర్గాల్లో వినిపించింది. హైదరాబాద్ మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ జీఎం పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడడంతో అక్టోబర్లో ఈ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అదే నెలలో శ్రీధర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. వెంకటేశ్ ప్రసాద్ పోటీపడటంతో ఆయననే ఈ పదవి వరిస్తుందని వార్తలు వచ్చిన అనూహ్యంగా కరీమ్ నియమితులయ్యారు. కరీమ్ భారత్ తరఫున ఒక టెస్టు, 34 వన్డేల్లో ఆడారు. 2001 ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కుడి కన్నుకు గాయం కావడంతో కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బోర్డును వ్యూహాత్మక దశదిశ వైపు నడిపించడం, నిర్వాహక విధానాలు అమలు చేయడం, పద్దులు, ఆట నియమాలు, మైదానాల ప్రమాణాలను పర్యవేక్షించడం, దేశవాళీ క్రికెట్ పాలన చూసుకోవడం జీఎంగా కరీమ్ విధులని బీసీసీఐ వెల్లడించింది.