ముంబాయి, డిసెంబర్ 23: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఆధార్ కార్డు అన్ని లావాదేవీలకు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటివలే గోవాలంటి రాష్ట్రంలో అమ్మాయిల కోసం విటులు ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలనే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముంబాయి ఐఐటీలో జరిగిన మూడ్ ఇండిగో ఫెస్టివల్ కు హాజరైన మాజీ కేంద్ర మంత్రి చిందబరం మోదీ సారథ్యంలోని ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఓ యువతి, యువకుడు కలిసి హాలీడేకి వెళ్లాలనుకున్నారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకోలేదు. అందులో తప్పు ఏముంది? ఒకవేళ ఆ యువకుడు కండోమ్ కొనాలనుకుంటే - అతను తన ఆధార్ వివరాలను ఎందుకు వెల్లడించాలి. ఎటువంటి మందులు కొంటున్నాను - ఎటువంటి సినిమాలకు వెళ్తున్నాను - ఏ హోటళ్లలో ఉంటున్నాను - నా స్నేహితులు ఎవరన్న అంశాన్ని ప్రభుత్వం ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది?` అని ఆధార్ ను ఉద్దేశించి చిదంబరం విమర్శించారు. ఇప్పటివరకు తన ఆధార్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయలేదని ఎవరు కూడా తమ ఆధార్ వివరాలను వెల్లడించవద్దని, జనవరి 17న అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు అందరూ వేచి ఉండాలని చిదంబరం పేర్కొన్నారు. ఆయన మాటలకు అక్కడే ఉన్న ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి స్పందిస్తూ... చిదంబరం మాట్లాడిన అంశాలన్నీ ఈ రోజుల్లో గూగుల్ లోనే దొరుకుతున్నాయని, అయితే వ్యక్తిగత విషయాలను భద్ర పరచడం ప్రభుత్వ కర్తవ్యమని - ఆ డిటైల్స్ ను హ్యాక్ చేయకుండా ఉండేందుకు పార్లమెంట్ చట్టం చేయాలని నారాయణ మూర్తి అన్నారు.