సామర్లకోట, డిసెంబర్ 23: ఇటీవల పంచారామ క్షేత్రమైన భీమేశ్వరాలయంలో చోరీ జరిగిన ఘటన మరువముందే, మరోసారి దుండగులు చోరికి పాల్పడ్డారు. స్వామి వారి ఆలయ మండపం వద్ద ఉన్న విఘ్నేశ్వర స్వామి వద్ద ఉన్న హుండీని, ఆలయ ఆవరణలోని హుండీల తాళాలను పగులగొట్టి నగదును అపహరించుకుపోయారు. ఆలయ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు ఆలయం వెనుక ఉన్న పుష్కరిణి గోడ దూకి ఆలయ ఆవరణలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్ద ఉన్న మెట్ల ఆధారంగా లోపలికి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఉదయం చోరీ జరిగినట్లు సిబ్బంది గుర్తించి ఈవో నారాయణమూర్తికి సమాచారం అందించగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి, వేలిముద్రలు, సీసీ పుటేజీల ఆధారంగా కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.