బీహార్, డిసెంబర్ 23: బీహార్ పోలీసులు ఓ నేరస్థుడ్ని సరికొత్త ఆలోచనతో పట్టుకున్నారు. అదేంటంటే దక్షిణాది ముద్దుగుమ్మ నయన తార ఫోటో చూపించి ఆ నేరస్థుడ్ని అదుపులోకి తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రం దర్బాంగా జిల్లాకు చెందిన భాజపా నాయకుడు సంజయ్ కుమార్ సెల్ఫోన్ను మహ్మద్ హసైన్ అనే నేరస్థుడు అపహరించి, పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా సీనియర్ పోలీసు అధికారిణి మధుబాలా దేవి అతని కాల్ డేటా రికార్డును ట్రేస్ చేయగా మహ్మద్ ఇంకా ఫోన్ను వినియోగిస్తున్నాడని నిర్ధారణలో తేలింది. ఆ తరువాత మధుబాలా దేవి నేరస్థుడికి ప్రపోజ్ చేసి, ప్రేమిస్తున్నట్లు నటించి, అతడికి సందేశాలు పంపారు. ఆ సందేశాలకు కొన్ని రోజుల తర్వాత అతడు స్పందించి ఫొటోను పంపించాలని కోరాడు. దీంతో ఆమె తెలివిగా సినీ తార నయనతార ఫొటోను పంపించారు. దాంతో చాల ఉత్సాహంగా దొంగ, ఆమెను కలవడానికి ఓ ప్రదేశానికి రమ్మని చెప్పాడు. ముధుబాలా దేవి ముసుగు ధరించి అతడి వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకుంది. ఓ సెల్ ఫోన్ కేసును ఈ విధంగా వినూత్నంగా చేదించిన తీరును చూసి ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.