న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఎక్కువగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు చేసిన వారె ఎక్కువ అని తేలింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇలాంటి ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్లకు ఏడేళ్ల జైలుశిక్ష విధించాలనే యోచనలో ఉంది. అంతేగాక, అన్ని వాహనాలకు జీవితకాల థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే భారీ కమర్షియల్ వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా నిబంధన విధించనుంది. దీంతో పాటు సరికొత్త ట్రాఫిక్ నియమాలను కూడా తీసుకురానుంది.