సియోల్, డిసెంబర్ 22: క్షిపణి ప్రయోగాలతో ముందుండే కయ్యాలమారి ఉత్తరకొరియా ఇటీవల శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణి ప్రయోగం తర్వాత ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ పార్టీ ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అగ్ర రాజ్యం అమెరికాపై మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. "ఉత్తరకొరియా అణు శక్తి పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచ రాజకీయ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. దీన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. మన దేశం అమెరికాకు అణుముప్పుగా అవతరిస్తోంది" అని కిమ్ అన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరకొరియా చమురు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై ఐరాస నేడు ఓటింగ్ నిర్వహించనుంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే.. అమెరికా, ఉత్తరకొరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముంది.