న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా ఓ కల లాగా మిగిలిపోయిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ కొత్త సంవత్సరంలో పట్టాలెక్కడం ఖాయమైంది. రైలు మార్గం మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం, శుక్రవారం ప్రధాని మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానిని శంకుస్థాపనకు రావాలని కోరగా, వీలు చూసుకుని ఎప్పుడొచ్చేది సమాచారం ఇస్తామని మోదీ వారికి చెప్పారు. ఈ మార్గంలో కీలకమైన మూడు వంతెనల నిర్మాణాల్లో ఇప్పటికే గౌతమి నదిపై వంతెన నిర్మాణ టెండర్లు ఖరారు కాగా.. వైనతేయ, వశిష్ట నదులపై వంతెన నిర్మాణాలే కీలకం కానున్నాయి.