హైదరాబాద్, డిసెంబర్ 22: భారత ప్రధమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. రామ్నాథ్ వచ్చిన రోజే రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత 26 న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులకు తేనేటి విందు ఇస్తారు. హైదరాబాద్ లో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన అమరావతికి వెళతారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.