న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : ఆకలితో ఉన్న బిచ్చగాడిని ఓ ఆశ్రమ సంస్థ వాళ్లు ఆహారం పెట్టి ఆదరించారు. అతనికి అన్ని సపర్యలు చేసి ఆదుకున్నారు. చివరగా స్నానం చేయించడం కోసం అతడి దుస్తులను తొలగిస్తుండగా కొన్ని పేపర్లు కింద పడ్డాయి. వాటిని పరిశీలించిన అక్కడి సిబ్బందికి ఊహించలేని షాక్ ఎదురయ్యింది. సదరు బిచ్చగాడి ఆధార్ కార్డుతో పాటు రూ.కోటికి పైగా బ్యాంక్ బ్యాలన్స్ ఉంది. వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంపన్నుడైన వ్యాపారవేత్త ముత్తయ్య నడార్ ఆరు నెలల కిందట రైలు ప్రయాణంలో తప్పిపోయి ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. దిక్కు తోచని పరిస్థితిలో బిక్షాటన మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీ జిల్లా రాల్పూర్ పట్టణంలో ఉన్న అంగ్రూమ్ స్కూల్ ఆవరణలో ఈనెల 13న ఆహారం కోసం వచ్చి కూలబడిన బిచ్చగాడిని స్వామి భాస్కర్ స్వరూప్జీ మహరాజ్ గుర్తించారు. అతడి వివరాలు ఆరాతీయగా దుస్తుల్లో ఆధార్ కార్డుతో పాటు రూ.1,06,92,731 విలువైన ఎఫ్డీ డాక్యుమెంట్లు ఉండటంతో నివ్వెరపోయారు. ఆధార్ కార్డులో గల సమాచారం మేరకు ఆయన కుమార్తె గీత రాల్పూర్కు విషయాన్ని తెలియజేయగా, ఆమె వచ్చి తండ్రిని తీసుకెళ్లిపోయారు. తమ తండ్రిని ఆదరించడంతో పాటు తమకు సమాచారం ఇచ్చిన స్వామి భాస్కర్ స్వరూప్జీ మహరాజ్కి, ఆయన అనుచరులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.