రాజాపేట, డిసెంబర్ 22 : యదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని మూడు తరాలకు చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ఒకే గదిలో శవాలై కనిపించారు. మృతుల్లో భార్యభర్తలు బాలరాజు(44), భార్య తిరుమల(39), కుమార్తె శ్రావణి(14), కుమారులు చింటూ(12) బన్ని(8), బాలనర్సయ్య(65), భారతమ్మ(58)గా గుర్తించారు. వీరి కుటుంబం అక్కడే ఉన్న కోళ్ల ఫారంలో పని చేస్తున్నట్లు సమాచారం. నెలన్నర క్రితమే వీరు కోళ్ల ఫారంలో పనికి చేరినట్లు తెలుస్తోంది. ఈ బాధితులు సిద్ధిపేట జిల్లాకు చెందిన జగదేవ్పూర్ మండలం మునిగడప వాసులు. మనవలు, మనవరాలిని చూసేందుకు రెండు రోజుల క్రితమే బాలనర్సయ్య, భారతమ్మ అక్కడికి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. బాధితులు తినే అన్నంలో విషం కలుపుకుని తిన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు.