మెల్ బోర్న్, డిసెంబర్ 21: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటన ఫ్లిందర్స్ స్ట్రీట్, ఎలిజబెత్ స్ట్రీట్ మధ్యలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుపు రంగు సుజుకీ ఎస్యూవీలో ఇద్దరు వ్యక్తులు ముందు సీటులో కూర్చొని ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా వేగంగా పాదచారులపైకి తీసుకెళ్ళారు. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా పాదచారులు గాయపడ్డారని, వారిలో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తితో పాటు పక్కన ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.