పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ బర్త్‌ డే వేడుకలు..!

SMTV Desk 2017-12-21 14:54:30  jagan, birth day, celebrations, padayatra

అనంతపురం, డిసెంబర్ 21: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుక పాదయాత్రలో నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నల్లమడకు తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వైఎస్‌ జగన్‌ బస చేసిన శిబిరం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అభిమానులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపి, వైఎస్‌ జగన్‌ చేత భారీ కేక్ కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు జగన్ సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సారి ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకల అనంతరం నల్లమడ క్రాస్‌ నుంచి జగన్ 41వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. రాగనిపల్లి, గోపేపల్లి, రామాపురం మీదుగా బొగ్గలపల్లి వరకు యాత్ర కొనసాగుతుంది. దారి పొడవునా ప్రజలందర్నీ పలకరించుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు తెలుగు రాష్ట్రాలో రక్తదానం చేయడంతో పాటుగా, పళ్లు, మందులు, దుస్తులను పంపిణీ చేశారు. పలు సేవా కార్యక్రమాలు చేసి ఘనంగా నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడే వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థించారు.