జైపూర్, డిసెంబర్ 21 : ఘనా ప్రొ బాక్సర్ ఎర్నెస్ట్ అముజు.. భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తో ఈ నెల 23 న సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో తలపడనున్నారు. కాగా ఈ సమరంలో విజేందర్ సింగ్ ను తన పవర్ ఫుల్ పంచ్ లతో మట్టి కరిపిస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజేందర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా అముజుతో పోరు కోసం ఎంతో సాధన చేస్తున్నా. ఫిజికల్గా, మెంటల్గా సన్నద్ధమయ్యా. ప్రత్యర్థి ఎర్నెస్ట్ ఎంతో అనుభవం కలవాడు. ఎక్కువ రౌండ్లు ఆడిన అనుభవం అతనికి ఉంది. సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టి వ్యూహాలను సిద్ధం చేసుకున్నా. తప్పక విజయం సాధిస్తాను" అని ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం ఎర్నెస్ట్ మాట్లాడుతూ.. "నా జైత్రయాత్రను కొనసాగిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. తొమ్మిది బౌట్లు గెలిచిన విజేందర్ నాకు పెద్దగా పోటీ ఇవ్వలేడు. ఈ పోరుకు నాకు ఎలాంటి ఒత్తిడి గాని, నిద్రలేని రాత్రులు గాని లేవు. అతన్ని బౌట్లో చిత్తు చేస్తా. అతడికి నాతో పోరే నిజమైన సవాలు" అని వెల్లడించారు.