హైదరాబాద్, జూన్ 17: ప్రపంచంలోనే భారీ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడంలో హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందింది. గతేడాది శివనాగేంద్రుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు గణేశుడు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో శ్రీచండీకుమార మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. గత ఏడాది కంటే ఈ ఏడాది మరో ఒక అడుగుతగ్గించి 57 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహానికి కుడివైపున మహా శివుడు, ఎడమ వైపున మహిషాసురమర్ధిని రూపాలను ఉంచుతున్నట్లు తెలిసింది. ప్రతిఏడాది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఎత్తును పెంచుకుంటూ పోయిన ఉత్సవ కమిటీ గత మూడేళ్ల నుంచి ఒక్కో అడుగు ఎత్తును తగ్గించుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విగ్రహ ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.