న్యాయస్థానం సమక్షంలో కలిసిన జంట...

SMTV Desk 2017-12-21 11:56:06  vijayawada, family court, a pardhasaradi,

విజయవాడ, డిసెంబర్ 21: వివాహం అయిన కొన్నాళ్లకే మనస్పర్ధలు చోటు చేసుకొని విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకులు పొంది తిరిగి ఏకమవ్వాలన్న ఉద్దేశ్యంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి న్యాయమూర్తులు, న్యాయవాదులు సమక్షంలో ఆ జంట కలిశారు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, గుంటూరుకు చెందిన శ్రావణిలు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కొద్ది రోజులకు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో భార్య 2011లో విజయవాడ ఫ్యామిలీ కోర్డులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు. 2012లో విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ఇరువురు వేరు వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో విడిపోవడం తప్పని తెలుసుకున్న ఇరువురు మళ్లీ కలవాలని తన న్యాయవాది జయలక్ష్మితో బుధవారం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిని పరిశీలించిన న్యాయస్థానం సాయంత్రం ఇరువురికి దండలు మార్పించి ఒక్కటి చేసింది. భార్యా భర్తలు ఎటువంటి సమస్యలు వచ్చిన వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి ఎ.పార్థసారథి అన్నారు.