న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : పెద్ద నోట్ల ముద్రణ తగ్గనుందా..? అంటే అవుననే అంటున్నాయి పలు అధ్యయనాలు. ఇప్పటికే రెండు వేల నోట్ల పంపిణీ నిలిచిపోయిందని చలామణిలోకి రాని నోట్లు ఆర్బీఐ దగ్గరే ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. డిసెంబరు 8 నాటికి.. ఆర్బీఐ 16,597 మిలియన్ల రూ.500నోట్లను ముద్రించగా, 3,654 మిలియన్ల రూ.2వేల నోట్లను ముద్రించింది. వాటి మొత్తం విలువ రూ.15,787 బిలియన్లు. కాని రూ.13,324 బిలియన్ల విలువ కలిగిన పెద్ద నోట్లు మాత్రమే చలామణిలోకి వచ్చాయి. మిగతా రూ.2,463 బిలియన్లు ఆర్బీఐ దగ్గర అలాగే ఉన్నాయని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ వెల్లడించారు. ఇకపై పెద్ద నోట్ల ముద్రణను ఆపివేసి, చిన్న నోట్ల ముద్రణను చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.