మధురై సమీపంలో కారు బోల్తా.. నలుగురు ఏపీ వాసుల మృతి

SMTV Desk 2017-12-19 11:23:56  accident, car, four dead, si, raghu, pamidi, anantapoor

అనంతపురం, డిసెంబర్ 19 : అమ్మానాన్నల కష్టాన్ని చూసి చలించిన అన్నదమ్ములు.. కష్టాల కడలి నుంచి వారికి విశ్రాంతినివ్వాలని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగారు. వారి ఎదుగుదలను చూసి విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువును పంపి అన్నదమ్ములిద్దర్నీ అనంత లోకాలకు చేర్చింది. వీరే సర్వస్వంగా బతుకుతున్న ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తమిళనాడులోని మధురై సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత‌పురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు.. పామిడిలోని బొడ్డురాయివీధికి చెందిన రఘు (29), రాంప్రసాద్‌ (27) అయ్యప్పస్వామి దర్శనానికి శనివారం ఉదయం పామిడి నుంచి బయలుదేరారు. తన మిత్రులైన మధుసూదన్‌రెడ్డి (35), సుబ్బరాయుడుతో కలిసి సొంత కారులో డ్రైవర్‌ మహేష్‌ (24)తో సహా వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారు మధురై సమీపంలోని మరవన్‌కుళం వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఎస్సై రఘుతో పాటు ఆయన సోదరుడు, కానిస్టేబుల్‌ రాంప్రసాద్‌, మిత్రుడు మధుసూదన్‌రెడ్డి, డ్రైవర్‌ మహేష్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని స్థానికులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో పామిడిలో విషాదఛాయలు అలుముకున్నాయి.