డిసెంబర్ 27న ఎపిలో పర్యటించనున్న రాష్ట్రపతి...

SMTV Desk 2017-12-18 11:28:11  president, andhrapradesh, indian economic summit. tour, finalized

గుంటూరు, డిసెంబర్ 18: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు మరోసారి రానున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పర్యటన ఈ నెల 27న ఖరారైంది. ఆ రోజు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్‌మిషన్‌ ప్రాంగణంలో ఇండియన్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌(ఐఈఏ) వందో సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి పర్యటన ఖరారు నేపథ్యంలో ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా పాలనాధికారి కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయారావులు బైబిల్‌మిషన్‌ ప్రాంగణానికి వెళ్లి సభాస్థలి ఏర్పాట్లపై యంత్రాంగానికి సూచనలు చేశారు. రాష్ట్రపతి 27న ఉదయం పదింటికి సభాస్థలికి చేరుకుని 12 గంటలదాకా ఆర్థిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం వెలగపూడిలోని సచివాలయానికి వెళతారు. అక్కడ భోజనం అనంతరం ఫైబర్‌గ్రిడ్‌ పథకాన్ని ప్రారంభించి విజయవాడ చేరుకునేలా పర్యటన ఖరారైనట్లు అధికారులు తెలిపారు.