భోపాల్, డిసెంబర్ 17: బైరాగఢ్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో సుమారు 100 కు పైగా దుకాణాలు బూడిదయ్యాయి. మంటలు చెలరేగి తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో జనం భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే విషయాలు, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు.